దుండిగల్,జూలై 30: తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసింది ఓ మహిళ. పుట్టెడు దు:ఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట గ్రామానికి చెందిన పలుపునూరి మల్లారెడ్డి భార్య పవిత్ర ఈ నెల 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తలకు గాయం కావడంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని యశోదకు తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతున్న పవిత్ర బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. దీంతో అవయవ దానం చేయాలంటూ జీవన్దాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పవిత్ర కుటుంబ సభ్యులను కలువగా.. వారు అందుకు సమ్మతించారు. కిమ్స్, యశోదలో చికిత్స పొందుతున్న వారికి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ఒక కిడ్నీ, కార్నియాను అమర్చారు. అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులను యశోద వైద్యులతో పాటు అవయవాలు స్వీకరించిన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.