దుండిగల్, ఏప్రిల్ 27 : బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన వైద్యులు ఆరు నెలల చిన్నారికి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత అరుదుగా కనిపించే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్తో బాధపడుతున్న ఓ చిన్నారి మెదడు సమీపంలో మాంసం ముద్దలా వచ్చి తలకాయంత పరిణామంలో తిత్తి ఏర్పడింది. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న ఆ చిన్నారికి ఎస్ఎల్జీ ఆస్పుత్రి కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్, డా.హెచ్. రాఘవేంద్ర శస్త్ర చికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యశాల యాజమాన్యం విడుదల చేసింది. పటాన్చెరువులో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ 9నెలలు నిండకముందే ఓ పాపకు జన్మనిచ్చింది.
ఆ చిన్నారి మూడు కిలోల బరువుతో సాదారణంగానే పుట్టింది. అయితే పాప తల వెనుక భాగంలో ఓ తిత్తిలాంటి నిర్మాణం పుట్టుకతోనే వచ్చింది. అది పాపతో పాటు పెరిగి పెద్దదై ఆరు నెలల వయసు వచ్చేసరికి తలతో సమానంగా తయారైంది. చూడటానికి రెండో తల లాగా కనిపించే ఆ తిత్తి పాపకు మోయలేని భారంగా మారింది. దీని వల్ల పాప తల నిలబెట్టలేకపోయేది. ఈ స్థితిలో ఆ బిడ్డ తల్లిదండ్రులు బాచుపల్లిలోని ఎస్ఎల్జీ వైద్యశాలను సంప్రదించారు. ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ స్కానింగ్ చేసి పాపకు తల వెనుక భాగంలో ఒక పెద్ద ఎన్సెఫలో సెల్ (మెదడు వెనుక భాగంలో పుర్రెకు అతుక్కుని ఉండే ఓ తిత్తిలాంటిది)తో పాటు నాడి కణజాలం సాగడం వల్ల హైడ్రో సెఫలస్ (నీటితిత్తి) వంటిది ఏర్పడిందని తెల్చి చెప్పారు.
హైడ్రోసెఫలస్ తల వెనుకభాగంలో ఉన్న తిత్తిలాంటి నిర్మాణాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఎస్ఎల్జీ వైద్యశాలలోని నిపుణులైన అనస్తిషీయన్లు చాకచక్యంగా నిర్వర్తించడంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స జరిగి నెలరోజులు గడిచిందని, పాప చాలా యాక్టివ్గా ఉందని డా. రాఘవేంద్ర తెలిపారు. తమ బిడ్డకు పునర్జనమ్మ ప్రసాదించడం పై పాప తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.