మేడ్చల్, ఆగస్టు13(నమస్తే తెలంగాణ): బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ వరకు ఆరు లేన్ల జాతీయ రహదారి (నేషనల్ హైవే) విస్తరణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్. హరీశ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో శుక్రవారం అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బోయినపల్లి నుంచి మెదక్ జిల్లా కాళ్లకల్ వరకు (జాతీయ రహదారి- 44) ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా కోల్పోతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులకు సంబంధించిన సమస్యలపై వివిధ మండలాల తాసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు చొరువ చూపాలన్నారు.
ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ శుక్రవారం అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. ఇంకా ఎన్ని నిర్మించాల్సి ఉంది. నిర్మాణాల విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీజనల్ వ్యాధులు, కరోనాపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. మున్సిపాలిటీలలోని లే అవుట్ల వివరాలు తెలుసుకోవడంతో పాటు పల్లె ప్రకృతి, నర్సరీలు, డంపింగ్ యార్డులను పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యా నాయక్, జడ్పీ సీఈఓ దేవసహాయం, ఆర్డీవో రవి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.