మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం, పెద్ద చెరువు కట్టపై నాగ దేవత, మైసమ్మ దేవాలయం,కేఎల్ఆర్ వెంచర్లోని మైసమ్మ దేవాయలం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు. నాగారం శ్రీ నాగలింగేశ్వర స్వామి, నాగదేవత ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
శామీర్పేట, మూడుచింతల్పల్లి మండలాలు, తూంకుంట మున్సిపాలిలలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టల వద్ద పాలు, ఫలహారాలతో నైవేద్యాలు సమర్పించారు. కీసరగుట్ట ఆలయ ప్రాంగణంలోని శ్రీ నాగదేవత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీర్యాల్లోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద కూడా కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు జరిపారు.