మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 8 : నాగారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం నర్సరీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు లక్షల 61 వేల 500 వందల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే వర్షాకాలంలో భారీ ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో పార్కులు, ఖాళీ స్థలాల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొక్కల పెంపకం పూర్తయిన వెంటనే హరితహారం వేదికగా పార్కులు, కాలనీలు, రహదారుల వెంట, ప్రధాన చౌరస్తాలు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చటి లోగిళ్లుగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
మున్సిపల్ పరిధిలోని ఐదు నర్సరీల్లో అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. అటవీ శాఖ, ఉద్యానవన అధికారుల సూచనలు, సలహాలతో పెంపకం చేపడుతున్నారు. నర్సరీల్లో మామిడి, అల్లనేరేడు, తులసీ, మనీ ప్లాంట్, ఉసిరి, పొప్పడి, కానుగ, వేప, రాగి, మందారంతో పాటు అనేక రకాల మొక్కలను పెంచుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఉద్యానవన, అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని నర్సరీల్లో నియమించి పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే హరితహారంలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా హరితహారంలో నాగారం మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు.
వచ్చే హరితహారాన్ని దృష్టిలో పెట్టుకొని నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నాం. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో క్రమం తప్పకుండా నీటిని అందించడంతో పాటు ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పడు నర్సరీలను పర్యవేక్షిస్తూ పెంపకంపై తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నాం. – వాణిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగారం