దుండిగల్, సెప్టెంబర్ 27 : ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను అనుమానంతో హత్యచేసి తాను ఆత్మహత్యకు యత్నించిన కిరణ్కుమార్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. పదునైన ఆయుధంతో భార్య గొంతుకోసి చంపిన కిరణ్కుమార్ అనంతరం తాను కూడా అదే ఆయుధంతో గొంతు కోసుకోవడంతో పాటు రెండు చేతులపై ఎక్కడపడితే అక్కడ కోసుకోవడంతో అధిక రక్తస్రావమైంది. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, గొంతు రెండు అంగుళాల లోతు వరకు తెగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ముందుగా అనుకున్న పథకం ప్రకారం శనివారం ఇంట్లోతల్లిదండ్రులు లేని సమయంలో అమలు చేశాడు. కిరణ్కుమార్ సైతం ఎందుకు బలవన్మరణానికి యత్నించాడు?, పైగా కిరణ్కుమార్ రాక్షసుడిగా మారడానికి కారణమేంటి? అనే విషయాలు తేలాల్సి ఉంది. కామారెడ్డి జిల్లా, గంధారి మండలం,తిమ్మాపూర్ గ్రామానికి గంగారాం- లక్ష్మి దంపతుల చిన్న కూతురు సుధారాణి, శ్రీరాంనగర్కు చెందిన సిద్దిరాములు – భారతీ దంపతుల పెద్ద కొడుకు ఎర్రోళ్ల కిరణ్కుమార్లు ప్రేమించుకుని నెల రోజుల క్రితం పెండ్లి చేసుకున్నారు.
వారం రోజుల క్రితం నిజాంపేట కార్పొరేషన్ పరిధి లోని ప్రగతినగర్కు మకాం మార్చారు. సుధారాణిని గొంతుకోసి దారుణంగా హతమార్చిన కిరణ్కుమార్ తదనంతరం తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలో కిరణ్కుమార్ బైక్పై వెళ్తూ కిందపడటంతో తన కొడుకు తలకు దెబ్బతగిలిందని, అప్పటి నుండే ఒక్కొక్కసారి విచక్షణారహితంగా ప్రవర్తించేవాడని తండ్రి తెలిపారు.