మేడ్చల్ రూరల్, జూన్ 10 : నిత్యం వీధుల్లో పని..ఓ వైపు కరోనా భయపెడుతున్నా వెరవకుండా పనిచేస్తుంటారు..ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంటూ వైద్యులు, దవాఖాన సిబ్బందితో సమానంగా బాధ్యతను పంచుకుంటున్నారు పారిశుధ్య కార్మికులు. తోటి కార్మికులు కరోనా బారిన పడినా వెనుకడుగు వేయకుండా వారిని ఆదుకుంటున్నారు. మహమ్మారితో చనిపోతే అయిన వాళ్లే దగ్గరకు రాకున్నా వారే ఆత్మబంధువులై అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉదారత చాటుకుంటున్నారు. ప్రతిరోజు రెండు విడుతలుగా చెత్తను శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు ఎత్తివేయడం, మురుగుకాల్వలు శుభ్రం చేస్తున్నారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బంది. పాలకవర్గం, అధికారులు అందిస్తున్న ప్రోత్సాహంతో కరోనాను అత్యల్పస్థాయికి తీసుకురావడంలో భాగస్వాములయ్యారు.
పంచాయతీగా ఉన్న గుండ్లపోచంపల్లిని కండ్లకోయ, గౌడవెల్లి, పూడూరు పంచాయతీల్లోని అనుబంధ గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఫలితంగా మున్సిపాలిటీ ఒకేచోట కాకుండా దూరంగా విస్తరించి ఉంది. కొన్ని గ్రామాలు 3 నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. దీంతో పారిశుధ్య పనులు నిర్వహించడం కష్టమైనప్పటికీ ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ అమరేందర్రెడ్డి పర్యవేక్షణలో శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి,ఆరుగురు సూపర్వైజర్లు, 60 మంది స్వీపర్లు, 60 మంది కామాటీలు పనిచేస్తున్నారు. కరోనాను లెక్క చేయకుండా ఉదయం, మధ్యా హ్నం రెండుదఫాలుగా రోడ్లు, డ్రైనేజీని శుభ్రం చేయడం, పారిశుధ్యం, శానిటైజేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.
ఇంటింటి జ్వర సర్వేలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే తక్షణమే కార్మికులు రంగంలోకి దిగుతున్నారు. పీపీఈ కిట్లు ధరించి, హైపోక్లోరైట్ను వారి ఇండ్ల చుట్టూ పిచికారీ చేస్తున్నారు. బాధితులకు నెగెటివ్ వచ్చేవరకు క్రమం తప్పకుండా హ్యాండ్ స్ప్రే ద్వారా పిచికారీ చేయడానికి 20 మందిని ప్రత్యేకంగా నియమించారు. ఎవరైనా కరోనాతో మృతిచెందితే పారిశుధ్య కార్మికులే బంధువులై అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు కరోనాతో 24 మంది మృతిచెందారు.
ఉదయం 5.30 గంటలకే పనిలోకి వచ్చి రోడ్లు ఊడుస్తున్నాం. మోరీలు తీస్తున్నాం. కరోనా వచ్చిన మొదట కొంత భయపడ్డాం. మాలో ఇద్దరికి సోకింది. సార్లు మాకు అన్ని జాగ్రత్తలు చెప్పి పనులు చేయించారు. ఇప్పుడు అలవాటైపోయింది. కరోనా ఉన్నా భయపడకుండా పనిచేస్తున్నాం.
-పోచమ్మ, కార్మికురాలు, గుండ్లపోచంపల్లి
మాకు టీకా ఇప్పించారు. చేతులకు తొడుగులు ఇచ్చారు. శానిటైజర్లు, సబ్బులు ఇస్తున్నారు. కోట్లు, తొడుగులు వేసుకొని,మాస్క్ పెట్టుకొని పనిచేస్తున్నాం. పని తర్వాత కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా వచ్చిన ఇండ్లను కూడా శుభ్రం చేస్తున్నాం. – అమృత, కార్మికురాలు, గుండ్లపోచంపల్లి
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో పారిశుధ్య కార్మికుల కృషి విశేషం. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మాస్క్లు, గ్లౌస్లు, శానిటైజర్లు, సబ్బులు తదితర సామగ్రి అందజేయడమే కాదు వాటిని విధిగా వాడేలా అవగాహన కల్పించాం. కరోనా టీకాలు కూడా ఇప్పించాం. -లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్, గుండ్లపోచంపల్లి