ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 4 : క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించి ఉన్నత స్థానానికి వెళ్లొచ్చని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో శనివారం జరిగిన అచీవర్స్ డే వేడుకలకు జయేష్ రంజన్తోపాటు ఎమ్మెల్సీ, కళాశాల ఫౌండర్ చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. విద్యా సంవత్సరంలో అనూహ్యంగా రాణించి అత్యున్నతస్థాయి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అచీవర్స్కు రూ.10 వేల చొప్పున నగదు పారితోషికం అందించారు. కరోనా సమయంలో కూడా విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు సాధించేలా కృషి చేసిన అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు. ఫౌండర్ చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు 150 కంటే ఎక్కువ కంపెనీల నుంచి 1465 ఉద్యోగాలు పొందారని, ఏడు ప్రసిద్ధ కంపెనీల్లో 100 పైగా ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాన్స్లర్ ప్రొ.యు బి దేశాయ్, వైస్ చాన్స్లర్ ప్రొ.రామచంద్రం, రిజిస్ట్రార్ సమీన్ ఫాతిమా, సీఈవో నీలిమ తదితరులు పాల్గొన్నారు.