మల్కాజిగిరి, జూలై 30: గడిచిన మూడేండ్లలో మల్కాజిగిరి నియోజకవర్గంలో రూ. 999 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. తాను చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. తనతో సమానంగా అభివృద్ధి చేసి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకొని అప్పుడు తనను విమర్శిస్తే బాగుంటుందన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి విడుదల చేయించిన నిధుల గురించి వివరించారు.
జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులకు రూ.474, భూగర్భ డ్రైనేజీ, రోడ్ల ఏర్పాటుకు రూ.80 కోట్లు, వాటర్ వర్క్స్, సీవరేజ్ కోసం రూ.40 కోట్లు, విద్యుత్ (ట్రాన్స్కో) రూ. 31.17 కోట్లు, ట్రాన్స్కో ప్రాజెక్టు కోసం రూ.21.5 కోట్లు, ఆర్యూబీ ఈస్ట్ ఆనంద్బాగ్లో రూ. 38 కోట్లు, హెచ్ఆర్డీసీ కోసం రూ. 6 కోట్లు, చెరువుల అభివృద్ధికి రూ. 14 కోట్లు, అల్వాల్లో వాటర్ పైపులైన్ కోసం రూ.191 కోట్లు, మౌలాలి కమాన్ అభివృద్ధ్దికి రూ.8.6 కోట్లు, బోనాలు, రంజాన్, క్రిస్మస్ కానుకల కోసం రూ.2 కోట్లు , కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు రూ. 30.2కోట్లు , సీఎంఆర్ఎఫ్కు కేటాయించినవి రూ. 5 కోట్లు, అల్వాల్, మల్కాజిగిరి పరిధిలో పెన్షన్లకోసం రూ.51.6 కోట్ల నిధులు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేంకుమార్, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీశ్గౌడ్, నాయకులు పిట్టల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్కుమార్, అనిల్ కిశోర్ , గుండానిరంజన్ , ఉపేందర్రెడ్డి, అంజయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.