మల్కాజిగిరి, జూలై 20: గ్రేటర్ పరిధి ప్రజలకు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంతరావు విజ్ఞప్తి చేశారు. ఉచిత మంచినీటి పథకానికి సంబంధించి జలమండలి ముద్రించిన కరపత్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే మైనంపల్లి జలమండలి జీఎం సునీల్కుమార్తో కలిసి విడుదల చేశారు. ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 15 వరకు గడువును ప్రభుత్వం పొడిగించిందని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, రాము యాదవ్, ఉపేందర్రెడ్డి, రావుల అంజయ్య పాల్గొన్నారు.
బీసీ ఫెడరేషన్ కులాల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హామీ ఇచ్చారు. ఈ మేరకు బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు అధ్యక్షతన పలువురు ప్రతినిధులు ఎమ్మెల్యే మైనంపల్లిని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలను తప్పకుండా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కీర్తి యుగంధర్, కార్యదర్శి రాకేష్ చేర్యాల, గ్రేటర్ వర్కింగ్ అధ్యక్షుడు వీరప్ప, గ్రేటర్ ఉపాధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.