వినాయక్నగర్, జూన్ 16: వరద ముంపు సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం వెంకటాపురం డివిజన్ జోషీనగర్లో రూ.1.50 కోట్లతో నాలా రిటైనింగ్ వాల్, రూ.8 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ గతంలో వచ్చిన వరదల వల్ల స్థానికులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సర్కిల్ పరిధిలోని నాలాలను అధికారులతో సర్వే చేయించి అవసరమైనచోట పటిష్ట ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు. డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ నాగమణి, ఈఈ రాజు, డీఈ కార్తీక్, ఏఈ అరుణ్, కార్పొరేటర్లు సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, డివిజన్ అధ్యక్షుడు అనిల్కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
గౌతంనగర్, జూన్ 16: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముంపు సమస్యకు చెక్ పడిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం గౌతంనగర్ డివిజన్ దయానంద్నగర్లో కార్పొరేటర్ మేకల సునీతతో కలిసి రూ.40లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ బాక్స్డ్రైన్, యూజీడీ డ్రైన్లతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద నుంచి విముక్తి కలుగుతుందన్నారు. దాదాపుగా మల్కాజిగిరి సర్కిల్లో రూ.20కోట్ల మేరకు డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు. నాలా విస్తరణ, మరమ్మతు, నాలా పూడికతీత పనులను వేగవంతం చేశామని తెలిపారు. వర్షాకాలంలో కార్పొరేటర్లు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.