మల్కాజిగిరి, జూన్ 11: మల్కాజిగిరి నియోజక వర్గంలోని అన్ని రంగాలను, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పరుస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణాల కోసం రూ 16.28 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ప్రజా ప్రతినిధులుగా విజయం సాధించిన తర్వాత అన్ని పార్టీలు తనకు సమానమేనని అన్నారు. భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి నేరేడ్మెట్ రూ.393 లక్షలు, వినాయక్నగర్ రూ.412 లక్షలు, మౌలాలి రూ.213 లక్షలు, ఈస్ట్ ఆనంద్బాగ్ రూ.281 లక్షలు, మల్కాజిగిరికి రూ.128 లక్షలు, గౌతంనగర్ డివిజన్లలో రూ.200లక్షలు నిధులతో పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.