కుత్బుల్లాపూర్,జూలై31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ కట్టుబొట్టుకు తగిన ప్రాధాన్యత లభించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నేడు(ఆదివారం) జరగనున్న బోనాల ఉత్సవాలను ప్రజలంతా సంతోషంగా గడుపుకునేందుకు ప్రభుత్వం నుంచి మంజూరైన బోనాల ఉత్సవ నిర్వాహణ ఖర్చుల కోసం నియోజకవర్గంలోని రూ.30 లక్షల 47 వేల విలువ గల చెక్కులను ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి అన్నిమతాల పండుగలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు అన్ని సదుపాయాలను కల్పించేలా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, చింతల్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, విజయ్రాంరెడ్డి, ఈఓ జే.కృష్ణమాచార్య, టీఆర్ఎస్ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.