కుత్బుల్లాపూర్, జూలై31: రక్తదానం చేసి.. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిలో రావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత పిలుపునిచ్చారు. శనివారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల సమావేశ హాల్లో నిలోఫర్ చిల్డ్రన్ హాస్పిటల్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ముఖ్యఅతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపద సమయంలో రక్తం లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీనికి తోడు వందల సంఖ్యలో రక్తహీనతతో బాధపడుతున్నారని అలాంటి వారికి రక్తాన్ని అందించేందుకు ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీలు మంగతాయారు, ప్రశాంత్, డా.వెరోనిక, శానిటేషన్ డీఈ ప్రశాంతి, ఎస్ఎస్ పోతారెడ్డితో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.