దుండిగల్/కుత్బుల్లాపూర్, జూలై29: ఇటీవల దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గిరిజన వర్గానికి చెందిన ఖేతావత్ భామినిబాయ్ని హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గిరిజన సామాజికవర్గం ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఈ విషయంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను కలిసి గిరిజన మహిళలకు జరుగుతున్న అన్యాయంపై వివరించి, ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు దుండిగల్ పోలీస్స్టేషన్లో సీఐ రమణారెడ్డిని కలిసి నిందితులను శిక్షించాలని వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే వివేకానంద్ బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చూడాలని పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజుతో ఫోన్ ద్వారా కోరారు. కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, నిజాంపేట కార్పొరేషన్ కార్పొరేటర్ వాంకడోతు బాలాజినాయక్, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శంకర్నాయక్, బంజారా సంఘం నాయకులు కృష్ణనాయక్, రవీందర్నాయక్, రాజునాయక్, ధర్మేంధర్నాయక్ ఉన్నారు.