జీడిమెట్ల/ గాజులరామారం, జూలై 19 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇంటింటికీ ఉచిత తాగునీటి హామీని నిలబెట్టుకున్నారని, ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాలో ప్రజలను ఉన్న సందేహాలను తీర్చేందుకే టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం చింతల్ డివిజన్ పరిధి వైఎంఎస్ ఫంక్షన్హాల్లో, గాజులరామారం డివిజన్ గాజులరామారంలోని మహారాజ ఫంక్షన్హాల్లో నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన‘టౌన్హాల్ మీటింగ్’కు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, సమస్యలను జలమండలి అధికారుల దృష్టికి సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, వినియోగదారులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ డైరెక్టర్ రెవెన్యూ వీఎల్.ప్రవీణ్కుమార్తో కలిసి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు గుడిమెట్ల సురేశ్రెడ్డి, కేఎం.గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వరరావు, సీజీఎం రెవెన్యూ శ్రీధర్, జీఎం శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మహమ్మద్ఫ్రీ, విజయరామిరెడ్డి, మల్లేశ్గౌడ్, పుప్పాల భాస్కర్తో పాటు డీజీఎంలు, మేనేజర్లు, సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే ఆధార్ను తమ క్యాన్ నంబర్తో అనుసంధానం చేసుకుని మీటర్ను తప్పని సరిగా బిగించుకోవాలన్నారు. తమ మీటర్లు పని చేసే విధంగా కండీషన్లో ఉన్నయో.. లేదో.. చెక్ చేసుకోవాలని తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్స్లు, వివిధ కాలనీలలో నివసిస్తున్న అన్ని ఫ్లాట్లకు ఆధార్ అనుసంధానం చేస్తేనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి రిబెట్ వర్తిస్తుందన్నారు. కొంత మంది ఆధార్ లింకుచేసుకుని కొందరు లింక్ చేసుకోకుంటే బిల్లు వస్తుందని తెలిపారు. ఒక వినియోగ దారుడు తమ ఆధార్తో ఒక క్యాన్కు మాత్రమే లింక్ చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ(ఓసీ) సమర్పించని వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కాదన్నారు.
జలమండలి మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చిందని, (HMWSSB 20KL ఉచిత నీటి రిజిస్ట్రేషన్’ ఇది ప్రతి ఒక్కరి ఫోన్లో ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుందన్నారు. దీని ద్వారా వినియోగదారులు తమ ఆధార్ నంబర్లను వారి క్యాన్తో అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం అమలుపై సందేహాల నివృత్తి కోసం వినియోగదారులు 155313 కస్టమర్ కేర్ను సంప్రదించాలన్నారు. ఈ పథకం గడువు గత ఏప్రిల్ మాసంలో ముగించినప్పటికీ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించిందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిందెలతో కుస్తీలు, మంచినీటి కష్టాలు, ధర్నాలు పూర్తిగా బంద్ అయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల నిధులు వెచ్చించి అన్ని ప్రాంతాల్లో నీటి పైపులైన్లు ఏర్పాటు చేస్తూ.. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తాగునీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ఈ పథకాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని సూచించారు.