దుండిగల్,జూలై13: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా అందజేస్తున్న దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులను మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిబ్బంది, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో సిబ్బంది, కార్మికులు ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపర్చుకొని సకాలంలో ప్రజల అవసరాలను తీర్చేలా బాధ్యతతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం సమావేశం హాల్లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి సమక్షంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులతో జనరల్ బడ్జెట్, కార్పొరేషన్లో గల అభివృద్ధి సమస్యలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గోపీ, డిప్యూటీ మేయర్ ధన్రాజ్యాదవ్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.