దుండిగల్,జూన్ 18 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ)ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఎన్ఎంసీలోని 33డివిజన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పను లు, సమస్యల పరిష్కారం, నూతనంగా చేపట్టనున్న పనులపై ప్రగతినగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా నెలకొన్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సంబంధిత కార్పొరేటర్లతో ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ డివిజన్లలో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్లు, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
పాపయ్యకుంట నుంచి బాలాజీ టవర్స్ వరకు, బండారీ లే అవుట్ నుంచి సాయిభాస్కర్ నెస్ట్ కాలనీ వరకు, ఆచారీ కుంట నుంచి బాటా జంక్షన్ వరకు, బాటా జంక్షన్ నుంచి బాలాజీ టవర్స్ వరకు, కేజీఎం ఎన్క్లేవ్ నుంచి కోకాకోలా కంపెనీ వరకు, శ్రీకృష్ణాహిల్స్ నుంచి క్విన్ ఇండియా వరకు, భవ్యాస్ ఆనందం నుంచి బలేక్ రిడ్జ్ అపార్ట్మెంట్ వరకు, మొండికుంట నుంచి ఎస్ఆర్ఆర్ ఫ్రైడ్ అపార్ట్మెంట్స్ వరకు నాలాల నిర్మాణానికి రూ. 87కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఈ పనులను వేగంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గోపీ, డిప్యూటీ మేయర్ ధన్రాజు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.