కుత్బుల్లాపూర్, జూన్ 18 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ జంట సర్కిళ్ల పరిధిలో నాలాల అభివృద్ధిపై పక్కా ప్రణాళికలు రూ పొందించి, వరద ముంపులో నాలా పరివాహక ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గతం లో కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి అనేక ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రస్తుతం కురిసే వర్షాలకు అలాంటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వెన్నలగడ్డ చెరువులో పరిసర ప్రాంతాల డ్రైనేజీ నిరు చేరుతుందని, సరైన ప్రణాళికతో డ్రైనేజీ నిరు చెరువులో చేరకుండా చర్యలు చేపట్టి చెరువును ఆధునీకరించాలన్నారు. గంపల బస్తీ నాలా, కోల్ నాలా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా నాలా ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యసేవకులకు ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మంగతాయారు, రవీందర్కుమార్, ఈఈ కృష్ణచైతన్య, డీసీపీ సంతోష్, కిష్టయ్య ఉన్నారు.