దుండిగల్, జూన్ 7 : నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటుచేసి రూ.5కే భోజనం అందిస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవ్యాస్ ఆనందం, బాచుపల్లిలోని జడ్పీ ప్రభుత్వ పాఠశాల సమీపంలో, ప్రగతినగర్లోని బావర్చీ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లను ఆయన మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల కడుపునింపేందుకు నాణ్యమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5 భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట కమాన్ వద్ద (నిజాంపేట రోడ్) రూ.25 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్చ్ ఆఫ్ యూనిటీ చిహ్నంతో పాటు రంగురంగులతో అభివృద్ధి చేసిన సెంట్రల్ మీడియన్ (డివైడర్)ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాంపేటను మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గోపి, డిప్యూటీ మేయర్ ధన్రాజ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్, జూన్ 7: నియోజకవర్గంలో డ్రైనేజీ, సీసీరోడ్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించా రు. 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూననగర్, న్యూవివేకానందనగర్ కాలనీలో కొనసాగుతున్న డ్రైనేజీ, సీసీరోడ్ల నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.