కుత్బుల్లాపూర్/ దుండిగల్, జూన్ 3 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట కార్పొరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం నిజాంపేట్ కార్పొరేషన్తో పాటు దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల పరిధిలోని మేయ ర్, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఆయా కాలనీలో సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అంతకుముందు పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభు త్వ భూముల సమస్యలు, కోర్టులో పెండింగ్లో ఉన్న అంశాలపై ఆరా తీశారు. ప్రజా అవసరాల కోసం ఉపయోగపడేలా చూడాలని, ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయా లు, కమ్యూనిటీ భవనాలు, శ్మశానవాటికలు, కాలనీల్లోని అంతర్గత సమస్యలతో పాటు ఇతర ప్రధానమైన సమస్యలపై చర్చించారు. అనంతరం టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాసమస్యలపై చర్చించి, అభివృద్ధికి కావాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని 18 ఏండ్లు నుంచి ప్రతిఒక్కరికీ టీకా వేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.