జీడిమెట్ల, మే 21 : ఎంతటి విపత్తు వచ్చినా.. పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారంనియోజకవర్గం పరిధిలోని ఎనిమిది డివిజన్లకు చెందిన 666 మంది లబ్ధిదారులకు రూ.6,66, 77,256 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను సూరారంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్తో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సహకరిస్తూ.. ప్రతి ఇంటా పెద్దన్నగా నిలుస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.
ఏ ఒక్కరికి ప్రభుత్వం పథకం అందకున్నా.. తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే అధికారులతో మాట్లాడి అందజేస్తామని సూచించారు. కుత్బుల్లాపూర్ చరిత్రలో ఎన్న డూ చేపట్టని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికే వందల కోట్లు వెచ్చించి.. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దా మని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించే విపక్షాలకు మీ కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధి, సంక్షేమం కనిపించడంలేదా..?మీ హయాంలో కనీసం ఒక్క బస్తీనైనా బాగుచేశారా.. అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న వారి కండ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే.. నాకు సంతోషంగా ఉందని అన్నారు. కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహిస్తూ.. కరోనాను కట్టడి చేస్తున్నదని తెలిపారు. ఇంటింటా ఫీవర్ సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. లాక్డౌన్ నిబంధనలు తప్పకుండా ప్రజ లు పాటించాలని కోరారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, జగన్, మంత్రి సత్యనారాయణ, సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు సురేశ్రెడ్డి పాల్గొన్నారు.
రంగారెడ్డినగర్ డివిజన్ సౌభాగ్యనగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫుట్పాత్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే వివేకానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య లేకుండా, షాపింగ్కు వచ్చే కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఫుట్పాత్ను నిర్మించాలని అధికారులకు సూచించారు.ఎన్టీఆర్ విగ్ర హం వద్ద 50ఏండ్ల క్రితం నిర్మించిన కల్వర్టు నుంచి నీరు సాఫీగా వెళ్లకపోవడంతో దుకాణ సముదాయాల్లోకి నీరు చేరుతుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన కల్వర్టు సామర్థ్యాన్ని పెంచి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కూకట్పల్లి జోన్ ఇంజినీరింగ్ ఎస్ఈ శంకర్నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామ్, షాపింగ్ సెంటర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.