కుత్బుల్లాపూర్, మే 10 : కరోనా విపత్కర సమయంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం వైద్య శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ వివిధ రాష్ర్టాల నుండి వచ్చిన వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, ఈ క్రమంలో ఇప్పుడు అందిస్తున్న సేవలను మరింతగా పెంచాలని కోరారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, వైద్య సిబ్బందిని భర్తీ చేసి అదనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచాలని, కరోనా టీకా కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేసి టెస్టింగ్ కిట్లను పెంచాలన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 2 డిహెచ్ఎం, 1ఎహెచ్, 2సిహెచ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.