గాజులరామారం,మే 5: కరోనా వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించా రు. బుధవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని బీరప్పనగర్,రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని నందానగర్లో ప్రభుత్వ వైద్య బృందాలు నిర్వహిస్తున్న సర్వేలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా వచ్చిందని తెలియగానే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తే బయటపడటానికి అవకాశం ఉందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ముప్పు ఉంటుందనారు. జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలను ఆదిలోనే గుర్తించి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తున్నారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఐదుగురు సభ్యులతో 19 బృందాలు ఏర్పాటు చేశారన్నారు. వైద్య బృందాలు ఇంటింటికీ విస్తృతంగా పర్యటించి సర్వే చేపడుతారని, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అక్కడిక్కడే మందులు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వేణుయాదవ్, పాపుల్గౌడ్,మహమూద్, కార్తీక్గౌడ్, శంకర్, రాజేశ్, సాయి,లక్ష్మణ్ పాల్గొన్నారు.