కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 27 : ట్రాఫిక్ రహితంగా నగర శివారు ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు నిరంతరం పాటుపడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై క్వశ్చన్ అవర్లో పురపాలక శాఖామంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నగర శివారు ప్రాంతమైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దినదినాభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. దీనికి తోడు జనాభా పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిందన్నారు. బాచుపల్లి నుంచి భౌరంపేట్, గండిమైసమ్మ మీదిగా మేడ్చల్ వరకు బహదూర్పల్లి చౌరస్తా నుంచి దూలపల్లి వరకు ఇన్నర్ రింగ్ రోడ్డుగా గతంలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోడ్లు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఉండిపోయిందని, ఈ రోడ్డును వెంటనే హెచ్ఎండీఏకు బదిలీ చేయాలని సభ దృష్టికి తీసుకెళ్లారు. నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లను కార్పొరేషన్కు, హెచ్ఆర్డీసీఎల్కి బదిలీ చేస్తే ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఆస్కారం ఉందన్నారు.
బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు జంక్షన్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సుచిత్ర సర్కిల్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్లే జాతీయ రహదారి-44లో ఉన్న జంక్షన్ల అభివృద్ధికి ఎన్హెచ్ఏఐ అధికారులతో సంప్రదింపులు జరిపి జంక్షన్ల అభివృద్ధికి రూ.1300 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. బోయిన్పల్లి చెక్పోస్ట్ నుంచి సుచిత్ర, జీడిమెట్ల, దూలపల్లి, కొంపల్లి, మేడ్చల్ మీదుగా కాళ్లకల్ వరకు జంక్షన్ల అభివృద్ధితో పాటు ైఫ్లై ఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు.
నాగ్పూర్ ప్రధాన రహదారి నుంచి ముంబాయి ప్రధాన రహదారికి అనుసంధానం చేసే లింక్రోడ్డు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాశ్నగర్ పైపులైన్ రోడ్డు ఉందన్నారు. ఈ రోడ్డు గతంలో 80 ఫీట్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలని రూ.40 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ బోర్డు ఏర్పాటు కాకముందే ఈ రోడ్డు భూసేకరణ జరగడంతో రికార్డులో లేదన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడకు అనుసంధానం చేస్తే ఫాక్స్సాగర్ లింక్రోడ్డును ఏర్పాటు చేసేలా రూపొందించిన ప్రతిపాదనలు పరిశీలించాలన్నారు. ఐడీపీఎల్ చౌరస్తా, షాపూర్నగర్చౌరస్తా, సూరారం చౌరస్తా, గండిమైసమ్మ చౌరస్తాల వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా జంక్షన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్ వెలుపల, లోపల గల రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ మొత్తం భూభాగాన్ని హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ పేరిట అభివృద్ధి పర్చేలా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపినట్లు ఎమ్మెల్యే చెప్పారు. బాలానగర్ ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంతో ఆ ఒత్తిడి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంపై పడుతుందని, ఈ అంశంపై త్వరలో చర్చించి అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.