కుత్బుల్లాపూర్,మే 3 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరంగా ప్రజా క్షేత్రంలో ఉంటూ పని చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం చింతల్ క్యాంపు కార్యాలయం నుంచి త్వరలో గాజులరామారం, కుత్బుల్లాపూర్ సర్కిళ్ల పరిధిలో ప్రారంభమయ్యే పలు అభివృద్ధి నిర్మాణాలపై ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీవెన్ ఎన్క్లేవ్లో రూ.19.95 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ.39.70 లక్షల వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెంకన్నహిల్స్లో రూ.10 లక్షలు, హెచ్ఏఎల్ ఎరోనాటికల్ కాలనీలో రూ. 10 లక్షలతో చేపట్టే భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు అయ్యాయి. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు గాను ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఇతర సమస్యలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా కాలనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ కోల్ నాలా నిర్మాణ సమస్యలపై సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయా విభాగాల శాఖా అధికారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోల్ కాలువ నిర్మాణ పనుల్లో పూడికతీత, వెడల్పు పనులపై అధికారులను ఆరాతీశారు. నాలా విస్తరణ పనులతో స్థలాలు కోల్పోయే వారిని గుర్తించి వారికి ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం సకాలంలో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి తోడు రాబోయే వర్షాకాలం నాటికి పనులు పూర్తిచేసి ఎలాంటి ముంపు లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఈఈ నారాయణ, ఏఈ నరేంద్ర, ఇంజినీరింగ్ సెక్షన్ ఈఈ క్రిష్ణచైతన్య, ఇరిగేషన్ విభాగం ఏఈ రామారావు, టౌన్ప్లానింగ్ డీసీపీ సంతోష్కుమార్ తదితరులు ఉన్నారు.