చర్లపల్లి, ఏప్రిల్ 16 : కుషాయిగూడలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, అరుంధతి కాలనీల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఈఈ కోటేశ్వర్రావు, ఏఈ సత్యలక్ష్యి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరుంధతి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాలనీలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసిన వెంటనే కాలనీలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గం పరిధిలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పనులను వేగవంతం చేస్తున్నామన్నారు.
ప్రధానంగా డ్రైనేజీలో చెత్త, వ్యర్థాలు పారవేయకుండా కాలనీవాసులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నియోజకవర్గం పరిధిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వార్డు కార్యాలయంలో అధికారులతో కలిసి పలు సమస్యలను వివరించి ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, మణిపాల్రెడ్డి, పద్మారెడ్డి, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, సారా అనిల్ ముదిరాజ్, అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, సత్యనారాయణ, రమేశ్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.