మేడ్చల్: తుర్కపల్లిలో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదంతమైంది. అప్పటివరకు తమ కళ్లముందే ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడికోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే ఐదేండ్ల పసివాడి నీటికుంటలో విగతజీవిగా కనిపించాడు. అప్పటివరకు తమ కుమారుడు మళ్లీ వస్తాడనుకున్న అతని తల్లిదండ్రులకు చివరికి కన్నీరే మిగిలింది.
మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలోని ఓ వెంచర్లో ఛత్తీస్గఢ్కు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు పనిచేస్తుండగా.. వారి ఐదేళ్ల కుమారుడు యువరాజ్ అక్కడే ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా బాలుడు కనిపించకపోవంతో కంగారుపడ్డ కన్నవారు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ జాడ కనిపించకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం సాయంత్రం బాలుడి ఆచూకీ కోసం గాలించారు. చివరకు రాత్రి పూట ఓ నీటికుంటలో ఆ పసివాడి మృతదేహం కనిపించింది. నీటికుంటలో ప్రాణంలేని యువరాజ్ను చూసి గుండెలవిసేలా రోధించారు.