కీసర, మార్చి 14 : ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా స్థానిక ఎన్నికల మాదిరిగా జరగడం చాలా సంతోషంగా ఉందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కీసరలోని పోలింగ్ కేంద్రానికి విచ్చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, లోకల్ బాడీ ఎన్నికలను తలపించే విధంగా జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొత్తగా ఓట్లు నమోదు చేయించుకున్న గ్రాడ్యుయేట్స్ అంతా సంతోషంగా విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మొత్తం తిరిగానని.. ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం మధ్య ఈ ఎన్నిక లు జరిగాయని అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నుంచి చక్కటి ఆదరణ లభించిందన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఎలాంటి అవగాహన ఉండేది కాదని, ఈసారి యువ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సంతోషంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, సర్పంచ్ మాధురి వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు వెంకటేశ్ ముదిరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు.