మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీం కింద రూ.77 కోట్ల 79 లక్షల నిధులను మంజూరు చేసింది. దీంతో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అభివృద్ధి పనులను చేపట్టారు. అభివృద్ధి పనులలో బీటీ రోడ్లు, ఇంట్రిగ్రేటేడ్ మార్కెట్లు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రహరి గోడల నిర్మాణాలు, పార్కులు, వీధి దీపాలు, వైకుంఠధామాల నిర్మాణ పనులను చేపట్టారు. కొన్ని మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాగా, మరికొన్ని మున్సిపాలిటీల పరిధిలో పనులు చివరి దశకు చేరుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం పుష్పలంగా నిధులను మంజూ రు చేయడంతో అభివృద్ధి పనులు జరిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక్షంగా పర్యవేక్షించి పనులను త్వరితగతిన పూర్తి చేయించే చర్యలు తీసుకుంటున్నారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎల్ఆర్ స్కీం నిధుల కింద చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశకు చేరాయి. అభివృద్ధి పనుల పూర్తికి మున్సిపాలిటీల కమిషనర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపాలిటీలలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు గాను ప్రభుత్వం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే మున్సిపాలిటీలకు మరిన్ని నిధులు మంజూరు కానున్నాయి. – కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్ఆర్ స్కీం నిధులు
మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్ల, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్ఆర్ స్కీం కింద 2020 – వార్షిక సంవత్సరానికి రూ.77 కోట్ల 79 లక్షలు మంజూరు చేసింది. మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని పూర్తి కాగా మరికొన్ని చివరి దశకు చేరాయి. త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎల్ఆర్ స్కీం నిధులతో పార్క్ల నిర్మాణాలు, అభివృద్ధి, ప్రభుత్వ ఖాళీ స్థలాల పరిరక్షణకు ప్రహరి గోడల నిర్మాణాలు, వైకుంఠధామాలు అభివృద్ధి పనులు జరుగుచున్నాయి. – శ్యాంసన్, జిల్లా అదనపు కలెక్టర్