పీర్జాదిగూడ, జూలై11: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని మొదటి డివిజన్లో రూ. 22.50 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు, 6వ డివిజన్ రాయంచ కాలనీలో సీసీ కెమెరాలు, 17వ డివిజన్లో ముఖద్వారాన్ని మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొదటి డివిజన్లో మేయర్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని భూగర్భ డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందిస్తున్నామని, వాటిని నాటి సంరక్షించాలని చెప్పారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు దర్గ దయాకర్రెడ్డి, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్నాయక్, కొల్తూరు మహేశ్, యుగేందర్రెడ్డి, శారద ఈశ్వర్ రెడ్డి, ప్రసన్నలక్ష్మి శ్రీధర్రెడ్డి, మంజుల రవీందర్, పాశం శశిరేఖ బుచ్చి యాదవ్, బండి రమ్య, సతీశ్ గౌడ్, కుర్ర శ్రీకాంత్గౌడ్, నాయకులు సతీశ్ గౌడ్, కృష్ణగౌడ్ వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నగరపాలక పరిధిలోని 6వ డివిజన్ రాయంచకాలనీలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. నగరపాలక పరిధిలోని కాలనీలు, ప్రధాన కూడళ్లలో ప్రమాదాలు, దొంగతనాలు, తదితర విషయాల్లో నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషిస్తాయని మంత్రి అన్నారు. అనంతరం నగరపాలక పరిధిలో ఏర్పాటు చేసిన ప్రెస్క్లబ్ కార్యాలయాన్ని సందర్శించి నూతన కమిటీ ప్రతినిధులను మంత్రి అభినందించారు.