ఉప్పల్, జూన్ 18 : కొవిడ్ నియంత్రణతోపాటు, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారంలోని సాధన మానసిక దివ్యాంగుల సంస్థ, ఈఎస్ఐ దవాఖానను శుక్రవారం సందర్శించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్, ఈఎస్ఐలో భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగుల సంస్థలో దివ్యాంగులకు, వారి తల్లిదండ్రులకు, వృద్ధులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధులకు వ్యాక్సిన్ వేయడం అభినందనీయమన్నారు.
అనంతరం సంస్థ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ నారాయణ, ఉప్పల్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌందర్యలత, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్, బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పావనీరెడ్డి, సంస్థ డైరెక్టర్ సురేఖారెడ్డి, సెక్రటరీ మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాచారం ఈఎస్ఐ నూతన భవనంలోని మూడు, నాలుగో అంతస్తులను కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని 70 లక్షల మంది ఈఎస్ఐ కార్డుదారులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈఎస్ఐలో వసతులు మెరుగుపరిచి, కార్పొరేట్ తరహ వైద్యసేవలు అందేలా చూస్తామన్నారు. అనంతరం మెడికల్, సర్జికల్, గైనకాలజీ వార్డులను పరిశీలించి, పేషెంట్లకు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో ఈఎస్ఐ బోర్డు సభ్యులు వేముల మారయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఈఎస్ఐ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పాల్గొన్నారు.