మేడ్చల్, మే 18: కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని.. ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్లోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఐసొలేషన్ సెంటర్ల ద్వారా కరోనా రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గం వ్యాప్తంగా ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, కరోనా రోగులు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దీపికానర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఫ్రీజర్ల అందజేత.. మేడ్చల్ మండలానికి మంత్రి మల్లారెడ్డి ఉచితంగా రెండు డెడ్బాడీ ఫ్రీజర్లను అందజేశారు. మేడ్చల్ పట్టణంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి ఒకటి, శ్రీరంగవరం గ్రామానికి మరో ఫ్రీజర్ను అందించారు.