మేడ్చల్, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా విజృంభిస్తుండటంతో మేడ్చల్ జిల్లాలో అదనంగా మరిన్ని ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 190 పడకలతో ఐసొలేషన్ వసతి ఉందని, త్వరలో నాచారం ఈఎస్ఐ దవాఖానలో 200 పడకలతో ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం కానున్నట్లు చెప్పారు. మల్లారెడ్డి కొవిడ్ కేర్ పేరిట 300 బెడ్లతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆయన తన నివాసంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించడంతో పాటు బాధితులకు చక్కటి వైద్యమందేలా చూడాలని సూచించారు. ప్రతి డివిజన్లో ఇంటింటి ఫీవర్ సర్వే త్వరగా పూర్తయ్యేలా వైద్య సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. కొవిడ్ లక్షణాలున్న వారికి ప్రభుత్వమిస్తున్న మందులు అందేలా చర్యలు తీసుకోవాలంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆధ్వరంలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడంపై మంత్రి నాయకులను అభినందించారు. టెలికాన్ఫరెన్స్లో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, మల్లారెడ్డి కొవిడ్ కేర్ నిర్వాహకుడు డాక్టర్ భద్రారెడ్డి పాల్గొన్నారు.