పీర్జాదిగూడ, ఏప్రిల్ 15 : మున్సిపల్, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులను వెచ్చిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని వైకుఠధామాలు తాగునీటి, డ్రైనేజీ రోడ్లు, చెరువుకుంటల అభివృద్ధికి కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. గురువారం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో పారిశుధ్య నిర్వహణ, హరితహారం, పండుగల నిర్వహణ, కరోనా సమస్య, నగరపాలకలో సెట్విన్ సంస్థ ఏర్పాటు, వీధిదీపాల ఏర్పాటు, తైబజార్, తాగునీటి నిర్వహణ, మిద్దె తోట, చెత్త తరలింపు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులు, నగరపాలక పరిధిలో కుక్కలు, పందులు, కోతుల బెడదలపై చర్చించిన అనంతరం నగరపాలక పరిధిలో రూ.23 కోట్ల నిధులను అభివృద్ధి పనులకు కేటాయించగా కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగాలని ఆయన కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.