మేడ్చల్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): గిరిజన, గిరిజనేతరులకు పోడు భూములపై శాశ్వత పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో అటవీ సంరక్షణ ఆంశాలపై అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాల్లారెడ్డి మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న వారికీ న్యాయం చేసి అడవుల సంరక్షణతో పాటు అడవుల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాం సన్, అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.