మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మునీరాబాద్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డితో కలిసి బుధవారం ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ గణేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన సూచనల మేరకు సీఎం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి, పరిపాలనను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ ప్రజలందరికీ సమానహక్కులు కల్పిస్తే, సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ద్వారా ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 960 గురుకులాలను ఏర్పాటు చేసి, 4 లక్షల మంది నాణ్యమైన ఆంగ్ల విద్యను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఇండ్ల నుంచి బయటికి రావొద్దని మంత్రి మల్లారెడ్డి ప్రజలకు సూచించారు. నెల రోజుల పాటు ప్రజలంతా ఒకచోట చేరి నిర్వహించుకునే పండుగలు, కార్యక్రమాలకు దూరం గా ఉండాలన్నారు. జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఓటు అనే ఆయుధాన్ని ప్రజలకు ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మజ, జడ్పీటీసీ శైలజ, గుండ్లపోచంపల్లి, మేడ్చ ల్ మున్సిపాలిటీల చైర్పర్సన్లు మర్రి దీపిక, మద్దుల లక్ష్మి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు రాగజ్యోతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు ధన్రాజ్నాయక్, ఎంపీటీసీలు రఘు, వెంకటేశం, సర్పంచ్ బాబుయాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు సురేశ్రెడ్డి, సుధాకర్రెడ్డి, రణదీప్రెడ్డి, నాయకులు జగన్రెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, దర్శన్, వివిధ గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జవహర్నగర్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జవహర్నగర్ కార్పొరేషన్ 26వ డివిజన్ చంద్రపురికాలనీలో స్థానిక కార్పొరేటర్ పానుగంటి బాబు సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం, కమ్యూనిటీహాల్ను మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, జవహర్నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల ఆశయాల కోసం నిరంతరం పోరాటం సాగించారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగన్న బాల్రాజ్పటేల్, ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి మహేశ్, కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, గండి రాంచందర్, మునిగాల సతీశ్, గొడుగు వేణు, బింగి లావణ్య, శారదామనోధర్రెడ్డి, గుండ్రాతి లక్ష్మి, లలితయాదవ్, నాయకులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఎనలేని సేవలందించిన మహనీయుడని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్థలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందల ఏండ్లుగా అణచివేతకు గురైన దళితులు, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.