ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 26 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మాదారం, ఎదులాబాద్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిలతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఉమ్మడి పాలనలో ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమానికి 24 గంటలు విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
దీంతో పాటు గిట్టుబాటు ధర కల్పించి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు.
జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలని చెప్పారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని , రైతులకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా సభ్యుడు భిక్షపతి గౌడ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, అధికారులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.