మేడ్చల్, అక్టోబర్ 10: టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం పట్టణంలోని ఓం శివసాయి కల్యాణ మండపంలో నిర్వహించారు. జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్రెడ్డి, మంత్రి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. క్రమశిక్షణ గల పార్టీలో నాయకులు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తల బలంతో పదవులు దక్కిన నాయకులు ప్రజా సేవ చేయాలని, సేవ చేసిన వారే నిజమైన నాయకుడని చెప్పారు. ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కమిటీల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్,ఎంపీటీసీలు కలిసి గ్రామంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం మండలంలోని శ్రీరంగవరం గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరగా వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశం హాలులో మహిళా నాయకులు తయారు చేసి ప్రదర్శించిన బతుకమ్మ ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, జడ్పీటీసీ శైలజ, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డి, నాయకులు భాస్కర్యాదవ్, సుదర్శన్, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, సుదర్శన్, జగన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఎవరు చనిపోయినా, వారి అంత్యక్రియలకు తన వంతు సహాయంగా రూ. 5 వేలు అందిస్తానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ సహాయాన్ని గ్రామాల్లో అందించే బాధ్యత గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులదేనని తెలిపారు.