బోడుప్పల్, సెప్టెంబర్ 26 : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ సాయి ఎన్క్లేవ్-ఫేజ్ 3లో రూ.50లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… బోడుప్పల్ పరిధిలో రూ.100కోట్లతో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. భవిష్యత్లో ముంపు సమస్య రాకుండా పూర్తిస్థాయిలో డీపీఆర్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చెంగిచర్ల చింతల చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక నాలా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 28వ డివిజన్ పరిధిలోని సాయి ఎన్క్లేవ్ కాలనీ నుంచి వెస్ట్ మారుతీనగర్ కాలనీలోకి చేరుతున్న మురుగునీటి ఉధృతిని మంద సంజీవరెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే వెళ్లి పరిశీలించారు. నెలరోజుల్లో ఒక మీటర్ డయా పైపులైను ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు కాలనీవాసులకు మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.