మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 25: సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన క్యాంపస్లో శనివారం 16వ స్నాతకోత్సవం, ప్రాంగణ నియామకాలు, పూర్వ విద్యార్థి సమ్మేళనం కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న ఎంతో మంది నేడు అతి పిన్న వయస్సులో అపర కుబేరులగా వెలుగొందుతున్నారన్నారు. 30 నుంచి 35 ఏళ్ల వయస్సు తమ సృజనాత్మకతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, అద్భుతమైన ఫలితాలు సాధించారన్నారు.
విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ప్రధానంగా కావాల్సింది క్రమశిక్షణ, సమయ పాలన, ప్రణాళిక అని పేర్కొన్నారు. వీటిని సోపానాలుగా వినియోగించుకుని, లక్ష్యం దిశగా సాగితే తప్పకుండా విజయం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ రామస్వామి రెడ్డి మాట్లాడుతూ ఈ యేడు కళాశాలకు చెందిన 936 మంది ఇంజినీరింగ్ పూర్తి చేశారని, చాలా మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. 10 దిగ్గజ కంపెనీల్లో కుమారి పేరిందేవి ఉద్యోగ అర్హత సాధించారని తెలిపారు. రూ.22 లక్షల అత్యధిక వేతన ప్యాకేజీ ఎంపికయ్యారని పేరిందేవిని అభినందించారు. కార్యక్రమంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్ర, సీఎంఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యురాలు శాలినీ రెడ్డి పాల్గొన్నారు, సమన్వయకర్తలుగా డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, శ్రీహరి వ్యవహరించారు.