ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 22 : పేదింటి బిడ్డలను సొంత మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆదుకుంటున్నారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి కొర్రెముల గ్రామ శివారులోని జేకే కన్వెన్షన్లో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 23మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి బుధవారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కాకూడదనే భావంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1లక్ష 116 ఆర్థిక సాయంగా అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచి దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఉపాధ్యాయ వృత్తి దేవుడితో సమానమని, అట్టి వృత్తికి ఉపాధ్యాయులు న్యాయం చేస్తూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి జేకే కన్వెన్షన్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లు, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలతో పాటు మండల పరిధిలోని అయా గ్రామాల పాఠశాలల్లో పనిచేస్తున్న 43మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూల మాలలతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ పావనీజంగయ్య యాదవ్, పోచారం మున్సిపల్ చైర్ పర్సన్ కొండల్ రెడ్డి, ఎంపీడీఓ అరుణ, మండల విద్యాధికారి శశిధర్, మున్సిపాలిటీల టీఆర్ఎస్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మందడి సురేందర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కందుల కుమార్, కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, బండారి ఆంజనేయులు, మల్లేశ్, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.