మేడ్చల్, సెప్టెంబర్ 20 : రైతు సంక్షేమ రాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే రైతులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని కండ్లకోయ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.
రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా, ఎరువులు, విత్తనాల సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు మూడేండ్లలోనే కాళేశ్వరం రిజర్వాయర్ను పూర్తి చేశారని చెప్పారు. గత సంవత్సరం 3 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి సాధించగా, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామని తెలిపారు. అనంతరం జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారని తెలిపారు.
మేడ్చల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, అనూహ్య రీతిలో అభివృద్ధి చెందుతున్న ఈ జిల్లా నగరానికి చేరువలో ఉన్నందున ప్రత్యేకతను సంతరించుకుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ తెలిపారు. టీఆర్ఎస్ అధినేత, నాయకులు, కార్యకర్తలను ఎవరైన కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు కన్వీనర్ నారెడ్డి నందారెడ్డి, ఎంపీపీలు పద్మాజగన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయేందర్రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివారెడ్డి, పీర్జాదిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గ దయాకర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నాగులూరుకు చెందిన మాసిని రవీందర్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా శ్రీకాంత్రెడ్డి, డైరెక్టర్లుగా సత్యనారాయణ, అబ్బగోని మాధవి, యార్లగడ్డ అంజన్లక్ష్మి, లిగోళ్ల హనుమాన్ దాస్, గోసిక అశోక్, తునికి మహేందర్, చందా నాగభూషణం గుప్త, తరిపి నర్సింహ, అధికార ప్రతినిధులుగా మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ జిల్లా వ్యవసాయశాఖ మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్లు ఎన్నికయ్యారు.