ఘట్కేసర్,జూలై29: కొత్తగా ఏర్పడిన శివారు మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీలోని 2వ వార్డు,13వ వార్డులో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 10వ వార్డులో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివారు మున్సిపాలిటీల్లో ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, కావాల్సిన నిధులను విడుదల చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేశ్, కౌన్సిలర్లు మహేశ్, ధనలక్ష్మి, రాజశేఖర్, వెంకటేశ్ గౌడ్, సాయిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, జూలై 29: మండల పరిధిలోని చౌదరిగూడ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 869, ప్రభుత్వ భూమిలో అప్పటి కొర్రెముల పంచాయతీ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. ఆ లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు.పేద ప్రజలను ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభు త్వం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. 1996లో పంచాయతీ పరిధిలో మంజూరు చేసిన పట్టాలను విచారణ చేసి ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, తాసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ అరుణ, సర్పంచ్ బైరు రమాదేవి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.