కంటోన్మెంట్, జూలై 28 : నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు బుధవారం బోయిన్పల్లిలోని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ సభ్యత్వ ఇన్చార్జి నరేంద్రనాథ్, మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి తదితరులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
సభ్యత్వ పుస్తకాలను పూర్తి చేసి రెండు రోజుల్లోగా అందజేయాలని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటోన్మెంట్లో 20వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయాని, త్వరలోనే 40వేల సభ్యత్వ లక్ష్యాన్ని అందుకునేలా ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు. సభ్యత్వ నమోదులో కంటోన్మెంట్ను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, ప్రభాకర్, నేతలు నివేదిత, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లాయని, గతంలో ఆ పార్టీలోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీఆర్ఎస్లోకి వస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మోత్కుపల్లి నర్సింహులు పార్టీలోకి వస్తుండగా, ఆదే దారిలో మరో బీజేపీ నేత పెద్దిరెడ్డి సైతం శుక్రవారం గులాబీ గూటికి చేరుకుంటున్నారని తెలిపారు. కంటోన్మెంట్కు చెందిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కూడా టీఆర్ఎస్లోకి వచ్చేందుకు తనతో మాట్లాడుతున్నారని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు హుజూ రాబాద్ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు.