మేడ్చల్, ఏప్రిల్3(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ఈనెల 16 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. రైతులకు అందుబాటులో జిల్లా వ్యాప్తంగా 12ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి పంటను 13,579 ఎకరాల్లో సాగు చేయగా 33వేల 948 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందనే అంచనాతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులునిర్ణయం తీసుకున్నారు. ఈనెల 10 నుంచి వరి కోతలు ప్రారంభం కా నున్న దృష్ట్యా 16 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు.
వ్యవసాయ, పౌరసరఫరాల, మార్కెఫెడ్శాఖల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తాయి. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ.1888 బీ గ్రేడ్ రకానికి రూ. 1868 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలును డీసీఎంఎస్, పీఎసీఎస్, ఎఫ్ఎస్సీఎస్, ఏఎంసీలు కొనుగోలు చేస్తాయి. కొనుగోలు కేంద్రాలు అవసరమైతే ఊర్లలోనే సబ్ కేంద్రాల ద్వారా కాంటాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా నేరుగా రైతు ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తారు. ధాన్యాన్ని విక్రయించే ముందు రైతులు తప్పనిసరిగా ఆధార్కార్డు, భూమి వివరాలు, బ్యాంక్ పాస్పుస్తకం, మొబైల్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. కోతల అనంతరం ధాన్యాన్ని అరబెట్టి శుభ్రం చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభు త్వం ఏర్పాటు చేస్తుంది. ఈనెల 16 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేస్తుంది. ధాన్యం అమ్మిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమచేయనుంది. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతులకు ఇబ్బందులు లేకుండా ఉన్న ఊర్లలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. -కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి