కీసర, జూలై 18: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం 19మంది గొర్లకాపరులకు సబ్సిడీ కింద 19 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం భోగారం గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, గ్రంథాలయాన్ని ప్రారంభించి మొక్కలను నాటారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరమే పల్లెల రూపురేఖలు మారిపోయాయన్నారు. గొర్ల కాపర్ల భవిష్యత్ను మార్చేందుకు మూడు సంవత్సరాల క్రితం సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.
భోగారం అనుబంధ గ్రామమైన బర్సీగూడలో వారం రోజుల్లో ఏడీ సర్వేను నిర్వహించి ఆ గ్రామానికి నక్షను ఏర్పాటు చేయాలని ఆర్డీవో, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మావతి, ఆర్డీవో రవికుమార్, తాసీల్దార్ గౌరివత్సల, పశువైద్యాధికారి శ్యామల, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, సర్పంచ్లు కవితజైహింద్రెడ్డి, పెంటయ్య, ఎంపీటీసీలు ప్రమీలఅమరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, భోగారం గ్రామ కో-ఆప్షన్ సభ్యులు నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, జూలై18 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మేడ్చల్ జిల్లాలో ఉన్న 61 గ్రామ పంచాయతీలకు రూ. 6కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. ఒక్కొక్క పంచాయతీకి రూ. 10లక్షల చొప్పున ప్రల్లెప్రగతి, కలెక్టర్ గ్రాంట్, ఎమ్మెల్యే కోటా నుంచి నిధులను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డంపింగ్ యార్డు తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.