మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 16: అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో శుక్రవారం జూమ్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆయా మున్సిపాలిటీలలో వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లు ఏఏ ప్రాంతాల్లో నిర్మించాలని, అవి ఏ దశలో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి మున్సిపల్ కమిషనర్ ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి ఒక బుక్ లెట్ తయారు చేయించి అభివృద్ధి పనుల వివరాలను ఎప్పటికప్పుడు జత చేయాలన్నారు. డంపింగ్ యార్డులు, గ్రామాలు, పట్టణాల్లో నిర్మిస్తున్న పల్లె, పట్టణ ప్రకృతి వనాలు పూర్తి చేయాలన్నారు. నాలాలు, చెరువులు, కుంటల పరిస్థితిపై ఆరా తీశారు. వర్షాకాలంలో నీరు వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, అందుకు తగిన వివరాలను పంపించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్ పాల్గొన్నారు.