మేడ్చల్, సెప్టెంబర్13(నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే చెరువుల వద్ద వైద్యశాఖ ఆధ్యర్యంలో శిబిరాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసే 18 చెరువుల వద్ద వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజునుంచే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో గణేశ్ నిమజ్జనం కోసం 18 చెరువులను ఎంపిక చేశారు. నిమజ్జనం సందర్భంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
వివిధ చెరువుల వద్ద నిర్వహించే గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ప్రథమ చికిత్స నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. అంతేకాక కుక్కకాటు, పాముకాటుకు గురైన వారికి చికిత్స అందించనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. 18 చెరువుల వద్ద 5 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాథమిక కేంద్ర వైద్యాధికారులు విధులు నిర్వహిస్తున్నారు.