మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో మేడ్చల్ జిల్లా ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో మేడ్చల్ జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలలో హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అందులో ఉత్తమంగా నిల్చిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. మేడ్చల్ జిల్లాకు చెందిన మున్సిపాలిటీలలో 8 మున్సిపాలిటీలు ఉత్తమంగా ఎంపికై రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచాయి. హరితహారం, శానిటైజేషన్ నిర్వహణను ప్రాతిపదికగా తీసుకొని వీటిని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ (మున్సిపల్ కార్పొరేషన్) పథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కొంపల్లి (మున్సిపాలిటీ), మూడో స్థానంలో దుండిగల్, నాల్గో స్థానంలో పోచారం, ఐదో స్థానంలో గుండ్ల పోచంపల్లి, ఆరో స్థానంలో మేడ్చల్, 11వ స్థానంలో దమ్మాయిగూడ, 12వ స్థానంలో ఘట్కేసర్(మున్సిపాలిటీ)లు ఎంపికయ్యాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం, పట్టణ ప్రగతిలలో పీర్జాదిగూడ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. హరితహారం మొక్క లు నాటడమే కాకుండా మొక్కలను సంరక్షించే చర్యలు తీసుకున్నాం. శానిటేషన్ నిర్వహణపై ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించి చర్యలు తీసుకున్నారు. ప్రతి కాలనీలలో ఇరువైపులా మొక్కలు నాటి ఇంటి యజమానులకు బాధ్యతలు ఇచ్చాం. పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో మొక్కలను పెంచాం. పట్టణ ప్రకృతి వనంలో మొక్కలు నాటి పచ్చందాలను సృష్టించాం. కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందించారు. జక్క వెంకట్రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ